Sushant Singh Rajput: సుశాంత్‌ డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లు తనకు చెప్పలేదన్న తండ్రి.. కూతురి వ్యాఖ్యలకు భిన్నంగా వాంగ్మూలం

  • ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలియదన్న కేకేసింగ్
  • పూర్తి నిరాశలో కూరుకుపోయి ఉండొచ్చని వ్యాఖ్య
  • సుశాంత్ మానసిక సమస్యల గురించి తమకు తెలుసన్న సోదరి 
  • సైకియాట్రిస్ట్‌ను కూడా కలిసేవాడని వ్యాఖ్య
kk singh on sushant cbi probe

బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ పలు వివరాలను తెలిపారు. తన కుమారుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తనకు తెలియదని ఆయన అన్నారు. సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లు తనతో ఎన్నడూ చెప్పలేదని తెలిపారు.

అయితే, పూర్తి నిరాశలో కూరుకుపోయే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నానని చెప్పారు. సుశాంత్‌ గత ఏడాది మే 13న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాకు వచ్చాడని, అదే నెల 16న తిరిగి ముంబైకి తిరిగి వెళ్లాడని చెప్పారు. తన కుమారుడితో వాట్సాప్‌లో సంభాషణ కొనసాగించేవాడినని తెలిపారు. ఈ మేరకు తన వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు.

సుశాంత్‌ మానసిక ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రతికూల ప్రచారంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని కేకే సింగ్ లాయర్ వికాస్‌ సింగ్‌ చెప్పారు.రియా చక్రవర్తే సుశాంత్‌ సమస్యలకు కారణమని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. సుశాంత్‌ తీసుకున్న వైద్య చికిత్స గురించి అతడి కుటుంబానికి రియా తెలియనివ్వలేదని చెప్పారు.

అయితే, సుశాంత్ మానసిక సమస్యల గురించి తమ కుటుంబానికి తెలియదని ఆయన తండ్రి కేకే సింగ్ చెప్పిన విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే, సుశాంత్ సోదరి మీతూ సింగ్ ఇటీవల అందుకు భిన్నంగా మాట్లాడింది. సుశాంత్‌కు ఉన్న మానసిక సమస్యల గురించి తమకు ఆరేళ్ల క్రితమే తెలుసని మీడియాకు చెప్పింది. అతడు సైకియాట్రిస్ట్‌ను కూడా కలిసేవాడని ఇప్పటికే స్పష్టం చేసింది.

More Telugu News