Nagpur: జీవితంలో కరవైన సంతోషం.. భర్త, ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • తొలుత భర్త, పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని తినిపించిన భార్య
  • ఆపై ఇంజిక్షన్ ఇచ్చి  హత్య
Nagpur Doctor Allegedly Dies By Suicide After Killing Husband and 2 Children

జీవితంలో సంతోషం కరవైందంటూ ఓ వైద్యురాలు భర్త, ఇద్దరు పిల్లల్ని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ సుష్మ రాణె, ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే ధీరజ్ (42) భార్యాభర్తలు. వీరికి 11, 5 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధీరజ్ తల్లి (60)తో కలిసి వీరంతా కొరాడి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అందరూ నిద్రపోయారు.

ఉదయం నిద్రలేచిన ధీరజ్ తల్లి బెడ్రూంలో నిద్రపోతున్న వారిని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి తలపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. ధీరజ్, ఇద్దరు పిల్లలు  బెడ్‌మీద విగతజీవులుగా పడి ఉండగా, వైద్యురాలు సుష్మ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

తన జీవితంలో ఆనందం కరవవడంతోనే ఈ పనికి పాల్పడినట్టు డాక్టర్ సుష్మ రాసిన సూసైడ్ నోట్‌ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, భర్త, పిల్లలను చంపేందుకు ఉపయోగించిన రెండు సిరింజిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తొలుత విషం కలిపిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించిన సుష్మ, ఆపై గుర్తు తెలియని ఇంజక్షన్ ఇచ్చి వారిని హత్య చేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News