Maniratnam: మణిరత్నం 'నవరస' కథలు.. తొమ్మిది మంది హీరోలు!

  • మణిరత్నం నిర్మాణంలో వెబ్ సీరీస్ 
  • నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్లు
  • ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో దర్శకుడు.. ఒక్కో హీరో
  • దర్శకుల జాబితాలో అరవింద్ స్వామి, సిద్ధార్థ్  
  • హీరోల లిస్టులో నాగార్జున, సూర్య , నాని  
Maniratnam to produce web series Navarasa

లాక్ డౌన్ లో ఓటీటీ మాధ్యమం విలువ అందరికీ తెలిసొచ్చింది. ముందుముందు దీని ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్న అంచనాలతో సినీ ప్రముఖులు చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. పారితోషికం పరంగా కూడా భారీ మొత్తాలు ముడుతుండడంతో ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఓటీటీ ప్లేయర్స్ కు కంటెంట్ సమకూర్చే పనుల్లో పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా ఓ వెబ్ సీరీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'నవరస' పేరిట తొమ్మిది ఎపిసోడ్లను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక్కో హీరో నటిస్తాడు. అలాగే ప్రతి ఎపిసోడ్ కీ ఒక్కొక్కరు దర్శకత్వం వహిస్తారు. ఇప్పటికే వీటికి దర్శకులుగా నటులు అరవింద్ స్వామి, సిద్ధార్థ్ లతో పాటు గౌతం మీనన్, బిజోయ్ నంబియార్, సుధ కొంగర, కేవీ ఆనంద్, జయేంద్ర, కార్తీక్ నరేన్ ఎంపికయ్యారు.

ఇక ఇందులో దక్షిణాదికి చెందిన పేరున్న హీరోలను నటింపజేయడానికి మణిరత్నం ప్రయత్నం చేస్తున్నారు. సూర్య, ఫహద్ ఫాజిల్, నాగార్జున, నాని, నాగ చైతన్య, కార్తికేయ వంటి హీరోలతో సంప్రదింపులు జరుగుతున్నాయట. మరి, వీటిలో ఏ ఎపిసోడ్ కైనా మణిరత్నం కూడా దర్శకత్వం వహిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అన్నది ఇంకా వెల్లడికాలేదు.  

More Telugu News