నిరసన జరుగుతోందని లాఠీచార్జ్ చేయడం సరికాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court says lathi charge is not justified just because a protest is happening
  • ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ
  • పోలీసులు హద్దులు మీరి ఉంటే స్వతంత్రంగా దర్యాప్తు జరగాలని సూచన
  • విద్యార్థులకైనా, పోలీసులకైనా గాయాలు కావడం సమానంగా ఆందోళనకరమన్న కోర్టు
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా, చట్టబద్ధంగా జరిగే నిరసనల్లో పాల్గొనడం ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందనే కారణంతో లాఠీచార్జ్‌కు దిగడం సరికాదని పేర్కొంది. పోలీసులు హద్దులు మీరి వ్యవహరించి ఉంటే స్వతంత్రంగా దర్యాప్తు జరగాలని సూచించింది.

విద్యార్థులు, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘సంసద్‌ చలో’ నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యలపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశవ్యాప్తంగా నిరసనల సమయంలో పోలీసులు అనుసరించాల్సిన విధానంలో ఏకరూపత అవసరమని అభిప్రాయపడింది. నిరసన జరిగిందనే కారణంతో బలప్రయోగం చేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా గాయపడిన పోలీసుల కుటుంబాల తరఫున వాదించేందుకు వచ్చిన న్యాయవాదికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. విద్యార్థులకైనా, పోలీసులకైనా గాయాలు కావడం సమానంగా ఆందోళనకరమేనని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ వ్యాఖ్యానించారు. నిరసనలను ఎదుర్కొనే పోలీసులకు హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలు ఎందుకు అందించలేదని రాష్ట్రాలను ప్రశ్నించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని పిటిషన్లను మంగళవారం కలిపి విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Advertisement
Supreme Court
NEET paper leak protest
Delhi police lathi charge
Right to peaceful protest
Justice Surya Kant
Student protests Delhi

More Telugu News