YSRCP: యనమల తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారు: వైసీపీ మంత్రుల ఆగ్రహం

  • ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
  • సభ వాయిదా వెనుక యనమల మాస్టర్ ప్లాన్ దాగివుందన్న కన్నబాబు
  • చైర్మన్ గత సమావేశాల మాదిరే వ్యవహరించారన్న ఉమ్మారెడ్డి
YSRCP Ministers gets anger on Yanamala after AP Legislative Council adjhourned

శాసనమండలి సమావేశాలు మూడ్రోజుల పాటు జరగాల్సి ఉన్నా, రెండ్రోజుల సమావేశాల అనంతరం మండలి నిరవధికంగా వాయిదా పడింది. దీనికంతటికీ కారణం టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అని వైసీపీ మంత్రులు, ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, సభ నిరవధికంగా వాయిదాపడడం వెనుక యనమల మాస్టర్ ప్లాన్ దాగివుందని విమర్శించారు.

మెజారిటీ ఉందన్న కారణంతో సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో లోకేశ్ ఫొటోలు తీస్తున్నాడని, ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడి చేసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి కన్నబాబు తెలిపారు. సభలో తీసిన ఫొటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని వెల్లడించారు. దీనిపై సభా నిబంధనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, టీడీపీ సభ్యులు బిల్లులను అడ్డుకున్నారని, తద్వారా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు మండలి నియమావళిని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తారు. మండలి సమావేశాలకు టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారని అన్నారు. చైర్మన్ కూడా గత సమావేశాల్లో మాదిరే వ్యవహరించారని తెలిపారు.

More Telugu News