Gadikota Srikanth Reddy: చంద్రబాబు బాధ అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారి గురించి కాదు: శ్రీకాంత్ రెడ్డి

  • అవినీతిపరులను అరెస్ట్ చేస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ?
  • మంత్రిగా అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డాడు
  • అవినీతిపై మాది కక్ష సాధింపే
Chadrababu worry is all about his son Lokesh says Srikanth Reddy

అవినీతిని వెలికి తీస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ఉంటామని ప్రమాణస్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. అక్రమ కట్టడమైన ప్రజా వేదికను కూల్చడంతో వ్యవస్థల ప్రక్షాళనను మొదలు పెట్టారని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని, జేసీ ప్రభాకర్ రెడ్డి అభినవ యముడులాంటి వాడని విమర్శించారు. వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని అన్నారు.

దమ్ముంటే అవినీతి నిరూపించాలంటూ గతంలో చంద్రబాబు సవాల్ విసిరారని... ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారని... అవినీతి, దోపిడి, అక్రమాలపై తమది కక్ష సాధింపేనని చెప్పారు.

చంద్రబాబు ఆందోళన అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారి గురించి కాదని... తన కుమారుడు లోకేశ్ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే... దాన్ని కిడ్నాప్ అంటారా? అని మండిపడ్డారు.

More Telugu News