Anushka Shetty: ఓటీటీలో సినిమా విడుదలకు కండిషన్ పెట్టిన నిర్మాత!

  • సినిమాలకు లాక్ డౌన్ దెబ్బ!
  • ఊరిస్తున్న ఓటీటీ భారీ ఆఫర్లు
  • 'నిశ్శబ్దం' నిర్మాతల షరతు
Anushka film may be released through OTT

లాక్ డౌన్ వల్ల సినిమా రంగానికి కూడా బాగా దెబ్బతగిలింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణం పూర్తి చేసుకున్నవి రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. మరోపక్క, సందట్లో సడేమియాలా ఇలా రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిత్రాలను తాము డిజిటల్ ప్లాట్ ఫాంపై విడుదల చేస్తామంటూ ఓటీటీ సంస్థలు ఎంటరవుతున్నాయి. భారీ మొత్తాలను కూడా ఆఫర్ చేస్తున్నాయి.

అయితే, కొందరు నిర్మాతలకు ఈ ఆఫర్లు ఆకర్షణీయంగానే కనపడుతున్నా, ఆ సినిమాలలో నటించిన హీరోల వల్ల ఒప్పందాలు జరగడం లేదు (ఓటీటీ ద్వారా రిలీజైపోతే తమ పాప్యులారిటీ తగ్గిపోతుందన్నది పెద్ద హీరోల అభిప్రాయం. అందుకే థియేటర్ రిలీజ్ నే కోరుకుంటారు). అనుష్క నటించిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది.

ఈ చిత్రాన్ని తమ ఓటీటీ ద్వారా విడుదల చేస్తామంటూ ఓ ప్రముఖ సంస్థ ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలను సంప్రదించిందట. భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసిందట. అయితే, నిర్మాతలు ఓ కండిషన్ పెడుతున్నారని సమాచారం. అదేమిటంటే, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చిత్రాన్ని థియేటర్లలో కూడా విడుదల చేసుకోవడానికి అనుమతించాలన్నది! ప్రస్తుతం దీనిపైనే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే దీని విడుదల పలుసార్లు వాయిదాలు పడడంతో నిర్మాతలు కూడా బయటపడడానికి సీరియస్ గా ఆలోచిస్తున్నారట.

More Telugu News