కరోనా ఎఫెక్ట్.. ఆసియా కప్ కష్టమే!
- టోర్నీపై అనిశ్చితి ఉందన్న ఆతిథ్య పీసీబీ చైర్మన్
- సెప్టెంబర్ లో జరగాల్సిన మెగా టోర్నీ
- ఇప్పటికే పలు క్రికెట్ టోర్నీలు, సిరీస్లు వాయిదా
ఈ సారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియాకప్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ఈ టోర్నీపై స్పష్టత ఇవ్వడం లేదు. టోర్నీ రద్దవుతుందన్న వార్తల నేపథ్యంలో పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి స్పందించారు. కానీ, ఆయన కూడా తాను ఏమీ చెప్పలేనని చేతులెత్తేశారు.
‘ఆసియా కప్ విషయంలో అనిశ్చితి ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ప్రస్తుతం ప్రపంచం మొత్తం అనిశ్చితి నెలకొంది. అందువల్ల సెప్టెంబర్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇలా చెబుతున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు. కానీ, టోర్నీ నిర్వహణపై అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. కేవలం ఊహాగానాలతో ఏమీ లాభం ఉండబోదు. బహుశా ఒక నెలలో ఈ పరిస్థితి మెరుగవ్వొచ్చు’ అని ఎహ్సాన్ పేర్కొన్నారు.
ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పీసీబీవే అయినప్పటికీ.. పాక్లో ఆడేందుకు భారత్ సహా చాలా దేశాలు సిద్ధంగా లేవు. దాంతో, ఈ టోర్నీని తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించాలని దాదాపు నిర్ణయించారు. కానీ, ఇప్పుడు కరోనా కారణంగా టోర్నీ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.