DGP: అరుదైన గౌరవం దక్కించుకున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి!

  • దేశవ్యాప్తంగా టాప్-25 ఐపీఎస్ అధికారుల జాబితా
  • 8వ స్థానంలో నిలిచిన మహేందర్ రెడ్డి
  • తొలి స్థానంలో ఐబీ చీఫ్, ఆపై రా, ఐటీబీపీ చీఫ్ లు
TS DGP Mahender Reddy in Best IPS Officers

తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) మహేందర్ రెడ్డి, అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లలో ఆయన 8వ స్థానంలో నిలిచారు. ఫేమ్‌ ఇండియా, ఆసియా పోస్ట్, పీఎస్‌యూ వాచ్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ జాబితాను విడుదల చేశాయి.

భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌ తొలి స్థానంలో నిలువగా, రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా) చీఫ్‌ సమత్‌ కుమార్‌ గోయల్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ టాప్-3లో నిలిచారు. ఆ తరువాత నాలుగో స్థానంలో సీఆర్‌పీఎఫ్‌ డీజీ మహేశ్వరి, 5వ స్థానంలో ఎన్ఎస్జీ చీఫ్‌ అనూప్‌ కుమార్‌ సింగ్, ఆరవ స్థానంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్‌ఎన్‌ సిన్హా, 7వ స్థానంలో బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే నిలిచారు.

1995కు ముందు బ్యాచ్ లలోని 4 వేల మంది అధికారుల పనితీరును సమీక్షించి, ఈ జాబితాను సిద్ధం చేశామని, పనితీరు, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని జాబితాను విడుదల చేసిన సంస్థలు పేర్కొన్నాయి. నేరాల కట్టడి, నిజాయతీ, నిష్పక్షపాతంగా విధి నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, భాధ్యతాయుత విధులు తదితరాలను కూడా మదించామని వెల్లడించాయి. ఈ జాబితాను పీఎస్‌యూ వాచ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది.

కాగా, ఉత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో తనకు చోటు దక్కడం మొత్తం తెలంగాణ పోలీసు సిబ్బందికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసు విభాగంలోని హోమ్ గార్డు నుంచి ఐపీఎస్‌ అధికారి వరకు ప్రతి ఒక్కరి సంకల్పం, పట్టుదల దీని వెనకున్నాయని అభివర్ణించారు.

More Telugu News