Advertisement

నా ఆస్తులన్నీ పోలేదు.. అది ఒక్క ప్రాపర్టీకి సంబంధించిన కేసు మాత్రమే: బండ్ల గణేశ్

Bandla Ganesh says I did not lose all my assets it is only one property case
  • తన ఆస్తులన్నీ పోయాయనడం పూర్తిగా అవాస్తవమన్న బండ్ల గణేశ్
  • షేక్‌పేటలోని 500 గజాల ఆస్తికి మాత్రమే కేసు పరిమితమని వెల్లడి
  • 2022లో రూ.8.51 కోట్లకు ఆస్తిని విక్రయించిన యూనియన్ బ్యాంక్
  • హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు కొట్టివేత
  • సుప్రీంకోర్టు తుది తీర్పును శిరసావహిస్తానన్న బండ్ల గణేశ్
సుప్రీంకోర్టు తీర్పుతో తాను సర్వస్వం కోల్పోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఖండించారు. షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ఆస్తికి మాత్రమే ఈ కేసు పరిమితమని ఆయన స్పష్టం చేశారు.

ఆస్తి మొత్తం పోయిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో బండ్ల గణేశ్‌కు చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆయన ఆస్తి కోల్పోయారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు.

"ఈ కేసు షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే సంబంధించింది. ఆ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వారు 2022లో రూ. 8.51 కోట్లకు విక్రయించారు. ఆ విక్రయాన్ని నేను చట్టపరంగా సవాలు చేశాను. డీఆర్‌టీలో మాకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, అనంతరం హైకోర్టు, సుప్రీంకోర్టులలో మా పిటిషన్ తిరస్కరించారు. సుప్రీంకోర్టు వెలువరించిన తుది తీర్పును నేను సంపూర్ణంగా గౌరవిస్తున్నాను. భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానాల తీర్పులను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతగా నేను భావిస్తున్నాను. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ, భారత రాజ్యాంగం మరియు న్యాయవ్యవస్థ పట్ల నా గౌరవాన్ని మరోసారి వ్యక్తం చేస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఏమిటీ కేసు?

హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు గానూ, బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంకు వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ బండ్ల గణేశ్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌ను(డీఆర్టీ) ఆశ్రయించారు.

డీఆర్టీ ఈ వేలం ప్రక్రియను రద్దు చేస్తూ గతంలో తీర్పునిచ్చింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారులకు వారు చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది. దీనిపై యూనియన్ బ్యాంకు హైకోర్టును ఆశ్రయించగా, డీఆర్టీ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. దీంతో బండ్ల గణేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది.
Advertisement
Bandla Ganesh
Supreme Court verdict
Aparna Senor Valley
Union Bank property auction
Shaikpet real estate case

More Telugu News