టీమిండియాలో మరో ఇద్దరు బ్రదర్స్!
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో ఈసారి మరో ఇద్దరు అన్నదమ్ముల జోడీ స్థానం దక్కించుకోవడం విశేషం. కరీబియన్లతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు దీపక్ చహర్, రాహుల్ చహర్ ఎంపికయ్యారు. దీపక్ చహర్ మీడియం పేసర్ కాగా, రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్. వీరిలో రాహుల్ చహర్ ఇంకా టీనేజ్ కుర్రాడే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో రాహుల్ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. తన అద్భుతమైన లెగ్ స్పిన్ తో 13 వికెట్లు సాధించాడు. ఇక దీపక్ చహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తొలి రంజీ మ్యాచ్ లోనే 5 వికెట్లకు పైగా సాధించి అబ్బురపరిచాడు. ఈసారి చహర్ సోదరులు టీమిండియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటివరకు మొహిందర్ అమర్ నాథ్-సురీందర్ అమర్ నాథ్, యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్య-కృనాల్ పాండ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు.