Nimmakayala Chinarajappa: ఏపీలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి: చినరాజప్ప
ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు బీజేపీ ఏపీ నేతలు ఫిర్యాదు చేయడంపై డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప తీవ్రంగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంలో అర్థం లేదని, ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించినప్పుడు ఆయనపై దాడి జరగలేదనే విషయమై ఇప్పటికే స్పష్టమైందని, అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులపై దాడులు ఎక్కడ జరిగాయో తనకు తెలియదని అన్నారు. తాము చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు.