ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయం కంటే బీజేపీ చేసిందే ఎక్కువ: గల్లా జయదేవ్

  • ఏపీకి  బీజేపీ న్యాయం చేస్తుందనే నమ్మకం పోయింది
  • కాంగ్రెస్ తో కలవమని కుమారస్వామికి  చంద్రబాబు చెప్పలేదు
  • వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి మేము ముందుకెళ్లాలో కాలమే నిర్ణయిస్తుంది
బీజేపీపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఏపీకి  బీజేపీ న్యాయం చేస్తుందనే నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే బీజేపీ ఎక్కువ అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని గుర్తుచేశారు.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో కలిసి తాము ముందుకు సాగాలనే విషయమై కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ తో కలవమని జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం చంద్రబాబు ఏమీ చెప్పలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లి గల్లా అరుణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయననే విషయాన్ని ఆమె అమెరికా వెళ్లే ముందు చెప్పారని, దీంతో, లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. 
Go Back to Shorts
Congress
galla jayadev
bjp

More Telugu News