హరిబాబు హత్య కేసులో పురోగతి.. బావమరిది సంతోష్ అరెస్ట్

హరిబాబు హత్య కేసులో పురోగతి.. బావమరిది సంతోష్ అరెస్ట్

Gandham Santosh arrested in Chittari Haribabu murder case in Nizamabad
  • నిజామాబాద్‌లో హరిబాబును కత్తితో పొడిచి హత్య
  • చెల్లెలి మృతికి ప్రతీకారంగా బావను చంపినట్టు చెప్పిన సంతోష్
  • విశాఖకు పారిపోతుండగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
  • హత్యను ప్రోత్సహించిన తల్లి, బంధువుల కోసం గాలింపు
నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసు నిందితుడు, యూట్యూబర్ వైష్ణవి సోదరుడు గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16న హరిబాబు తన భార్య వైష్ణవిని హత్య చేశాడు. ఈ కేసులో హరిబాబు, అతడి తల్లి, ఇద్దరు సోదరులు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు.

అప్పటి నుంచి హరిబాబు తల్లి నిజామాబాద్‌లోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. నెల రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన హరిబాబు, తన తల్లిని చూసేందుకు ఈ నెల 17న నిజామాబాద్ వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వైష్ణవి అన్న సంతోష్, హరిబాబుపై కత్తితో దాడి చేసి హతమార్చి కారులో పరారయ్యాడు.

అనంతరం ఈ హత్యను తానే చేశానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగా హరిబాబును అంతమొందించానని నిందితుడు సంతోష్ అదే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శనివారం నిజామాబాద్ బైపాస్ వద్ద రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంతోష్ తల్లి రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ ప్రోత్సహించారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని, అరెస్ట్ చేసిన సంతోష్‌ను రిమాండ్‌కు తరలిస్తామని ఆయన వివరించారు.
Advertisement
Gandham Santosh
Chittari Haribabu
Nizamabad murder case
Youtuber Vaishnavi
Revenge murder
Telangana Police

More Telugu News