నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య

నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య

Nizamabad YouTuber husband brutally murdered in broad daylight
  • కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తి
  • భార్య వైష్ణవి హత్య కేసులో హరిబాబు గతంలో నిందితుడు
  • పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసుల అనుమానం
  • ఈ దాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తింపు
నిజామాబాద్ నగరంలో పట్టపగలే యూట్యూబర్ భర్త హత్య జరిగింది. యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)ను గుర్తుతెలియని వ్యక్తి కిరాతకంగా నరికి చంపాడు. నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ఈ ఘోరం జరిగింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హరిబాబుపై ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ దాడిలో ముగ్గురు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా వారు కారులో ఉండగా, ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19)కి, కోరుట్ల పట్టణంలోని ఏసుకోనిగుట్ట ప్రాంతానికి చెందిన హరిబాబుతో వివాహం జరిగింది. అయితే, గతంలో యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. భర్త హరిబాబు ఆమెను గొంతు నులిమి చంపడమే కాకుండా, చేతులు, నుదుటిపై కత్తితో పొడిచినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతకాలం రిమాండ్‌లో ఉన్న అతడు, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు పథకం ప్రకారం హరిబాబును హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Advertisement
Chittari Haribabu
Nizamabad murder case
YouTuber Vaishnavi husband
Telangana crime news

More Telugu News