33 గంటల జర్నీ.. ప్రయాణికులకు ఫ్రీ భోజనం.. ఇదే ఆ రైలు

33 గంటల జర్నీ.. ప్రయాణికులకు ఫ్రీ భోజనం.. ఇదే ఆ రైలు

Sachkhand Express 33 hour journey and free food for passengers
  • సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు ఉచిత భోజనం
  • 2,000 కిలోమీటర్లకు పైగా సాగే రైలు ప్రయాణం
  • న్యూఢిల్లీ సహా పలు స్టేషన్లలో లంగర్‌ ఏర్పాటు
  • అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందజేత 
  • అన్ని తరగతుల ప్రయాణికులకు ఒకే భోజనం
  • దాతలు, స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో సేవ
రైలు ప్రయాణం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది స్టేషన్లలో దొరికే ఆహారం, ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం, రైల్లో అమ్మే మీల్స్‌. కానీ ఓ రైలులో మాత్రం ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందుతుంది. అది కూడా ఒక్కసారి కాదు.. దాదాపు 33 గంటల సుదీర్ఘ ప్రయాణంలో పలుసార్లు ఉచిత భోజనం అందుతుంది. అదే మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు నడిచే సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌. ఈ ఉచిత భోజన సర్వీస్‌ భారతీయ రైల్వే, లేదా ఐఆర్‌సీటీసీ ఇస్తున్న సదుపాయం కాదు.

సిక్కుల రెండు పవిత్ర క్షేత్రాలను కలిపే ఈ రైలు ప్రయాణంలో దశాబ్దాలుగా ‘లంగర్‌’ అందించే సంప్రదాయం కొనసాగుతోంది. నాందేడ్‌లో తఖ్త్‌ సచ్‌ఖండ్‌ శ్రీ హజూర్‌ సాహిబ్‌ ఉంది. అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయంగా పేరొందిన హర్మందిర్‌ సాహిబ్‌ ఉంది. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కీలక రవాణా మార్గంగా ఉంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం
తఖ్త్‌ సచ్‌ఖండ్‌ శ్రీ హజూర్‌ సాహిబ్‌ అధికారిక వెబ్‌సైట్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనాల ప్రకారం.. ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత లంగర్‌ అందించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. రైల్వేలో ఎన్నో మార్పులు వచ్చినా ఈ సేవ మాత్రం ఆగలేదు. సేవాభావం, దాతృత్వం, అందరికీ సమానంగా భోజనం అందించాలనే సిక్కు సంప్రదాయాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

2,000 కిలోమీటర్ల ప్రయాణంలో..
సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. దాదాపు 39 స్టేషన్లలో ఆగుతుంది. సుమారు 33 గంటల ఈ ప్రయాణంలో న్యూఢిల్లీ, భోపాల్‌, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్‌ వంటి ప్రధాన స్టేషన్ల వద్ద లంగర్‌ ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు.

అందరికీ ఒకే భోజనం
లంగర్‌ అంటే సామూహిక వంటశాల. ఇందులో కులం, మతం, ఆర్థిక స్థాయి, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందరికీ భోజనం పెడతారు. సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే విధానం కనిపిస్తుంది. జనరల్‌ కోచ్‌లో ప్రయాణించే వారైనా, ఏసీ బోగీల్లో ఉన్నవారైనా ఒకే భోజనం అందుకుంటారు.

సాధారణమైనా కడుపు నింపేలా..
లంగర్‌లో సాధారణంగా పప్పు, శనగలతో చేసిన కూర, వేడి కిచిడీ, ఆలుగడ్డ కూర, కాలీఫ్లవర్‌ వంటి కూరగాయల వంటకాలు ఉంటాయి. ప్రయాణికులు తమ ప్లేట్లు లేదా డబ్బాలు తెచ్చుకుని భోజనం తీసుకుంటారు. దీంతో వ్యర్థాలు తగ్గడంతో పాటు పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది.

ఈ సేవకు వివిధ గురుద్వారాలకు చెందిన దాతలు, స్వచ్ఛంద కార్యకర్తలు సహకరిస్తారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలనే ‘సేవా’ భావన ఇందులో కనిపిస్తుంది. అందుకే సచ్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణం చాలామందికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. భక్తి, సేవ, సమానత్వాన్ని అనుభవించే ప్రత్యేక అనుభవంగా మారుతోంది.
Advertisement
Sachkhand Express
Free food in train
Nanded to Amritsar train
Langar service
Hazur Sahib
Golden Temple

More Telugu News