మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని దర్శించుకున్న ఉపాసన
- స్థానిక గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఉపాసన
- ఉపాసనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన చరణ్ అభిమానులు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ భార్య ఉపాసన కొణిదెల పర్యటించారు. ఉదయాన్నే ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రాలయానికి చేరుకున్న ఆమెకు రాఘవేంద్ర స్వామివారి ఆలయ అధికారులు, పీఠం ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
మంత్రాలయం పర్యటనలో భాగంగా ఉపాసన ముందుగా స్థానిక గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామిని దర్శించుకోగా, ఆయన ఉపాసనకు మంత్రాలయం విశేష శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. రాఘవేంద్ర స్వామి దివ్య ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉందని ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, తమ అభిమాన కథానాయకుడు చరణ్ భార్య మంత్రాలయానికి వచ్చారన్న సమాచారం వ్యాపించడంతో... ఆమెను చూసేందుకు అభిమానులు, స్థానిక భక్తులు ఆలయ ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంత్రాలయం మఠ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.