చేతులు కలిపిన మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. వైరల్ అవుతున్న ఫోటో

చేతులు కలిపిన మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. వైరల్ అవుతున్న ఫోటో

Narendra Modi Vladimir Putin and Xi Jinping join hands in viral photo
  • ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రత్యేక దృశ్యం
  • రష్యా, చైనా అధ్యక్షులతో చేతులు కలిపిన ప్రధాని మోదీ
  • ఏడేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న జిన్‌పింగ్
  • 'న్యూఢిల్లీ డిక్లరేషన్' ఆమోదించిన బ్రిక్స్ దేశాలు
  • గ్లోబల్ సౌత్ పాత్ర పెరగాలని పిలుపునిచ్చిన మోదీ
భారత ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఒక ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. "ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు 2026 ప్రారంభమైంది" అనే క్యాప్షన్‌తో ఆయన ఈ పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గురు అగ్రనేతలు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండటం గమనార్హం. ఆయన శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోగా, పుతిన్ అంతకుముందే శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ పంచుకున్న ఇతర చిత్రాలలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఉన్నారు.

భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ గమనాన్ని నిర్దేశించడంలో గ్లోబల్ సౌత్ దేశాలు ఇకపై వెనుకవరుసకే పరిమితం కాకుండా, నిర్ణయాధికారాల్లో కీలక భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, శనివారం తెల్లవారుజాము వరకు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం 'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు బ్రిక్స్ దేశాధినేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
Advertisement
Narendra Modi
Vladimir Putin
Xi Jinping
BRICS Summit 2026 Delhi
New Delhi Declaration
Bharat Mandapam

More Telugu News