నా సినిమాలను నేను చూడలేను: ప్రీతి జింటా
- కొంత విరామం తర్వాత గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా
- స్క్రీన్ పై తనను తాను చూసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని వెల్లడి
- సీన్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుందన్న ప్రీతి
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంత విరామం తర్వాత ఆమె ‘వైబ్’ అనే యాక్షన్ కామెడీ మూవీతో పాటు 'బట్వారా 1947' చిత్రం గ్రాండ్ రీఎంట్రీ ఇస్తోంది. 'వైబ్'లో ఆమె 'మేడమ్ హెచ్' అనే పవర్ఫుల్ సూపర్ స్పై పాత్రలో కనిపించనున్నారు. వంశిక ధీర్, కునాల్ ఖేము, స్పర్ష్ శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా జరిగిన ప్రమోషన్లలో నటి వంశిక ధీర్ మాట్లాడుతూ... పెద్ద తెరపై తనను తాను చూసుకున్నప్పుడు 'ఇంపాస్టర్ సిండ్రోమ్' అనిపించిందని చెప్పగా, ప్రీతి జింటా ఆసక్తికరంగా స్పందించింది. ఇన్ని ఏళ్ల అనుభవం ఉన్నా, ప్రతి కొత్త పాత్ర చేసేటప్పుడు 'చేయగలనా, లేదా?' అనే సందేహం తనకూ వస్తుందని ఆమె చెప్పింది. "నేను నా సినిమాలను స్క్రీన్ పై ఎప్పుడూ చూడలేను. థియేటర్లో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచనే వస్తుంది" అని ప్రీతి వెల్లడించింది.