దుష్ప్రచారాలు నమ్మొద్దు: గణేశ్ నిమజ్జనాలపై హైడ్రా చీఫ్ రంగనాథ్
- గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదన్న రంగనాథ్
- సున్నితమైన చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు అమలులో ఉన్నాయని వెల్లడి
- అన్ని చెరువులు, జలాశయాల్లో నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని స్పష్టీకరణ
హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, వ్యతిరేక ప్రచారాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. చెరువుల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా ఎప్పుడూ వ్యతిరేకం కాదని, తాము పునరుద్ధరణ పనులు చేపడుతున్న చెరువుల వద్ద నిమజ్జనాలకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అసత్య ప్రచారాలను ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన నాలుగైదు సున్నితమైన చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా బయో డైవర్సిటీగా గుర్తించిన అమీన్పూర్ చెరువు, నేచురల్ వెట్ల్యాండ్గా రక్షణ పొందిన కాప్రా చెరువులు ఇందులో ఉన్నాయని గుర్తుచేశారు. కాప్రా చెరువులో ప్రస్తుతం నీరు లేనందున అక్కడ ఎవరూ సమస్యలు సృష్టించవద్దని కోరారు.
నగరంలోని మిగిలిన అన్ని చెరువులు, జలాశయాల్లో వినాయక నిమజ్జనాలు ఎప్పటిలాగే యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. ప్రధాన నీటి వనరులు, చెరువుల పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు, భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు విస్తృతంగా 'బేబీ పాండ్స్' ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హైడ్రా సుందరీకరిస్తున్న చెరువుల వద్ద ఎటువంటి నిషేధాలు లేవని, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణ హితంగా నిర్వహించుకునేలా భాగ్యనగర ప్రజలు, ఉత్సవ సమితి ప్రతినిధులు సహకరించాలని కోరారు.