తుమ్మల నాగేశ్వరరావు పనితీరు, వ్యక్తిత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు
- ఇతర పార్టీల వారికి కూడా మంచి చేసే నాయకుడు తుమ్మల అన్న పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి
- తుమ్మల అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారని ప్రశంస
- ఏ సమస్యపై ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తారని కితాబు
కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేసే నాయకుడిని, వారి నిబద్ధతను గుర్తించి మెచ్చుకోవడంలో తప్పులేదని వారు స్పష్టం చేశారు. "మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఇంతటి ఓపిక, జవాబుదారీతనం ఉన్న మంత్రిని గతంలో చూడలేదు" అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏ సమస్యపై ఫోన్ చేసినా మంత్రి తుమ్మల వెంటనే స్పందిస్తారని... ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై అందుబాటులో ఉంటారని తెలిపారు. సమీక్షలు లేదా పనుల్లో ఉండి ఫోన్ తీయలేకపోయినా, వీలైనంత త్వరగా తిరిగి ఆయనే కాల్ చేసి మాట్లాడతారని చెప్పారు.
ప్రజలు లేదా నియోజకవర్గాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళితే ఎంతో ఓపికతో విని, ఆ సమస్య పూర్తయ్యే వరకు అధికారులతో స్వయంగా మాట్లాడతారని పేర్కొన్నారు. పని ఏ దశలో ఉందో, ఎప్పుడు పరిష్కారమవుతుందో కూడా మళ్లీ తిరిగి ఫోన్ చేసి అప్డేట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు, తోటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పాలనా సమర్థతను, ఓపికను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు సూచించారు.