కార్యకర్తే అధినేత.. లోకేశ్ ఆధ్వర్యంలో నవతరం నాయకత్వం: టీడీపీ కాంక్లేవ్ లో ఏలూరి సాంబశివరావు

కార్యకర్తే అధినేత.. లోకేశ్ ఆధ్వర్యంలో నవతరం నాయకత్వం: టీడీపీ కాంక్లేవ్ లో ఏలూరి సాంబశివరావు

Eluri Sambasiva Rao says workers are leaders under Lokesh leadership at TDP Conclave
  • కార్యకర్తలకు రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించడమే చంద్రబాబు లక్ష్యమని వెల్లడి
  • 2040 నాటికి టీడీపీ కుటుంబాల సగటు ఆదాయం రూ.75 లక్షలు దాటాలని అధినేత ఆకాంక్ష
  • లోకేశ్ ఆలోచనతో కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం
  • ప్రతిభ ఆధారంగానే పదవులు.. సిఫార్సులకు తావులేదని స్పష్టీకరణ
  • ‘నా తెలుగుదేశం - నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కేవలం గౌరవం ఇవ్వడమే కాకుండా, వారికి రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించడమే అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ శిక్షణా సదస్సులో ‘రాజకీయ, ఆర్థిక సాధికారత’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. 2040 నాటికి దేశంలో సాధారణ తలసరి ఆదాయం రూ.50 లక్షలకు చేరితే, టీడీపీ కార్యకర్తల కుటుంబాల ఆదాయం నీతివంతమైన మార్గాల్లో రూ.75 లక్షలు దాటాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని ఏలూరి వెల్లడించారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉండే కోటి మందికి పైగా సభ్యులున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన కొనియాడారు. కార్యకర్త ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. నారా లోకేశ్ ఆలోచనతో కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, తల్లిదండ్రులను కోల్పోయిన కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ సభ్యత్వ కార్డు కేవలం గుర్తింపు మాత్రమే కాదని, అది ఆ కుటుంబానికి పార్టీ ఇస్తున్న బీమా, విద్య, వైద్య, ఉపాధి భరోసా అని వర్ణించారు.

సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉన్న తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం ప్రతిభ ఆధారంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని ఏలూరి గుర్తుచేసుకున్నారు. పార్టీలో సిఫార్సులకు తావులేదని, ప్రతిభకే పట్టం కడతారని స్పష్టం చేశారు. నారా లోకేశ్ నేతృత్వంలో ‘కార్యకర్తే అధినేత’ అనే సిద్ధాంతంతో నవతరం నాయకత్వాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ "నా తెలుగుదేశం - నా బాధ్యత" అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Eluri Sambasiva Rao
Nara Lokesh
TDP Leadership Conclave
Chandrababu Naidu
Telugu Desam Party
Andhra Pradesh Politics

More Telugu News