కష్టపడి మెగా డీఎస్సీ సాధించిన నిరుద్యోగులపై బురదజల్లుతారా?: రాంప్రసాద్ రెడ్డి
- డీఎస్సీ విజేతలపై బురదజల్లడాన్ని వైసీపీ నేతలు మానుకోవాలన్న రాంప్రసాద్ రెడ్డి
- స్వార్థ రాజకీయాల కోసం వారిని అవమానించవద్దని హితవు
- ఉద్యోగాలు సాధించిన వారి కష్టాలను ప్రశ్నించవద్దని సూచన
మెగా డీఎస్సీలో ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల శ్రమను, వారి విజయాన్ని అవమానించేలా వైసీపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరమని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగా డీఎస్సీ సాధించిన అభ్యర్థులను వేధించడం, వారిపై బురదజల్లడాన్ని వైసీపీ నేతలు వెంటనే మానుకోవాలని హితవు పలికారు.
2018 డీఎస్సీలో తృటిలో ఉద్యోగం కోల్పోయినప్పటికీ నిరాశ చెందకుండా.. ఏడేళ్ల పాటు పట్టుదలతో, రాత్రింబవళ్లు తేడా లేకుండా చదివి ఎన్నో త్యాగాలు చేసి 2025 మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించారని మంత్రి కొనియాడారు. వారి విజయాన్ని స్వార్థ రాజకీయాల కోసం అవమానించడం తగదని మండిపడ్డారు.
అప్లికేషన్ల స్వీకరణ నుంచి మెరిట్ జాబితా విడుదల వరకు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేసిందని స్పష్టం చేశారు. మెరిట్, అర్హత ప్రాతిపదికన ఉద్యోగాలు సాధించిన వారి కష్టాన్ని ప్రశ్నించడం ఆయా అభ్యర్థుల కుటుంబాల త్యాగాలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తుతో రాజకీయ క్రీడలొద్దని, అభ్యర్థుల ఆవేదనను గ్రహించి జగన్ తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు.