ఓ మాజీ మంత్రి కోడలిని మతం మారమన్నారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says former minister daughter-in-law was asked to convert
  • ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బయటపెట్టారని చంద్రబాబు వెల్లడి
  • బయటకు హిందువులుగా నటిస్తూ ఇంట్లో మత మార్పిడులు చేశారని విమర్శ
  • గత ప్రభుత్వంలో బలవంతపు మత మార్పిడులు జరిగాయని ఆరోపణ
  • దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని గత పాలనపై ఫైర్
  • ఇటీవల మీడియా ముందుకు వచ్చిన జోగి రమేశ్ కోడలు మేఘన
గత ప్రభుత్వ హయాంలో బలవంతపు మత మార్పిడులు జరిగాయని, దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ మాజీ మంత్రి ఇంట్లోనే మత మార్పిడికి ఒత్తిడి జరిగిందని, ఆయన కోడలే ఈ విషయాన్ని బయటపెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకు పర్యటనలో 'సంజీవని' కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "ఒక మాజీ మంత్రి కోడలు బయటకు వచ్చి, తనను ఇంట్లో మతం మారమని ఒత్తిడి చేస్తే తాను గట్టిగా నిరాకరించానని చెప్పింది. బయట హిందువులుగా చలామణి అవుతూ ఇంట్లో ఇలాంటి పనులు చేశారు. ఇది చాలా తప్పు. విశ్వాసం అనేది వ్యక్తిగతం, కానీ దాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం దుర్మార్గం" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గత  పాలనలో జరిగిన కొన్ని ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగాయని, ఆ పార్టీలో ఉండాలంటే మతమే ఒక కనీస అర్హతగా మార్చే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపించారు. బలవంతపు మత మార్పిడులు మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఇటువంటి చర్యల వల్లే ప్రజలు గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

ఇటీవల మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ కోడలు మేఘన మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
Advertisement
Chandrababu Naidu
Jogi Ramesh
Forced Conversions
Andhra Pradesh Politics
Araku Sanjeevani Program
YSRCP

More Telugu News