భారీ వరదల వేళ నేపాల్‌ కీలక నిర్ణయం.. భారత్‌ సహా పలు దేశాలకు నో!

Nepal key decision during floods says no to foreign rescue teams including India
  • విదేశీ రెస్క్యూ బృందాల సాయాన్ని తిరస్కరించిన నేపాల్‌
  • భారత ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పంపే ప్రతిపాదననూ అంగీకరించని నేపాల్‌
  • వరదల్లో ఇప్పటివరకు 469 మంది మృతి
  • దాదాపు వెయ్యి మంది గల్లంతైనట్లు అంచనా
  • 4,348 మందితో నేపాల్‌ పోలీసుల గాలింపు
భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో విదేశీ రెస్క్యూ బృందాల సాయం తీసుకోకూడదని నిర్ణయించింది. తమ భద్రతా బలగాలే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేసింది. భారత్‌, చైనా సహా పలు దేశాలు పంపిన సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది.

బుధవారం భోటేకోషి, త్రిశూలి నదీ వ్యవస్థల పరిధిలో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మట్టి, శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు.

భారత్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలు రెస్క్యూ సిబ్బందిని పంపేందుకు ముందుకొచ్చాయి. వందలాది మంది భారతీయులు గల్లంతైన నేపథ్యంలో ‘భారత్‌ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’(ఎన్‌డీఆర్‌ఎఫ్‌)ను పంపేందుకు అనుమతి కోరింది. నేపాల్‌ ఆ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది.

2015 భూకంపం సమయంలో పెద్ద సంఖ్యలో విదేశీ రెస్క్యూ బృందాలు రావడంతో సమన్వయం, నిర్వహణలో ఇబ్బందులు ఎదురైన అనుభవం ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విదేశీ బృందాల బదులు ఆర్థిక సాయాన్ని ఒకే వ్యవస్థ ద్వారా అందించాలని నేపాల్‌ కోరుతోంది.

నేపాల్‌ పోలీసులు 4,348 మందిని సహాయక చర్యల్లో మోహరించారు. రసువా నుంచి 644 మంది, నువాకోట్‌ నుంచి 898 మంది, ధాదింగ్‌ నుంచి ముగ్గురిని రక్షించారు. గల్లంతైనవారిలో విదేశీయులు కూడా ఉన్నారు. 178 మంది భారతీయులు, 65 మంది అమెరికన్లు, 51 మంది మలేషియన్లు, 53 మంది ఉక్రెయిన్‌ వాసులు, 33 మంది బ్రిటన్‌ పౌరులు, 35 మంది ఆస్ట్రేలియన్లు, 25 మంది కెనడా పౌరుల ఆచూకీ తెలియడం లేదు.

అయితే ఆర్థిక, మానవతా సాయాన్ని నేపాల్‌ స్వీకరిస్తోంది. అమెరికా 5 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వైద్య సామగ్రిని పంపింది. విదేశీ పౌరుల సమాచారం, సహాయక చర్యల కోసం నేపాల్‌ విదేశాంగ శాఖ అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
Advertisement
Nepal
Nepal floods
Foreign rescue teams
India NDRF
Nepal disaster relief
Trishuli river floods

More Telugu News