త‌మిళ‌నాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల సీట్లలోకి సీఎం విజయ్!

Rare scene in Tamil Nadu Assembly CM Vijay sits in ministers seats
  • అసెంబ్లీలో దీర్ఘకాల సంప్రదాయాన్ని పక్కనపెట్టిన సీఎం విజయ్
  • తన కుర్చీ నుంచి లేచి మంత్రుల మధ్య కూర్చుని ఆశ్చర్యపరిచిన వైనం
  • ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్న సభా వర్గాలు
  • సభలో అధికారులు ఉండాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత ఉదయనిధి
  • ఉదయనిధి వాదనతో ఏకీభవించి హామీ ఇచ్చిన స్పీకర్ ప్రభాకర్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. శాసనసభలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పద్ధతికి భిన్నంగా, తన కోసం కేటాయించిన ప్రత్యేక కుర్చీని వీడి, మంత్రుల కోసం ఉన్న వరుసలో వారి పక్కనే కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన సభలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సాధారణంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రికి స్పీకర్ కుర్చీకి దగ్గరగా, ప్రత్యేకమైన, విశాలమైన కుర్చీని కేటాయిస్తారు. మంత్రులు వారి సీనియారిటీ ప్రకారం సీఎం పక్కన మొదటి వరుసలో కూర్చుంటారు. వారికి ఎదురుగా ప్రతిపక్ష నేత, ఇతర శాసనసభాపక్ష నేతలు ఆసీనులవుతారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం.

అయితే, నిన్న‌ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ అనూహ్యంగా తన కుర్చీ నుంచి లేచి, సభా నాయకుడైన మంత్రి కేఏ సెంగొట్టయాన్, మరో మంత్రి ఆదవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కొద్దిసేపు తమ సహచరులతో మాట్లాడేందుకు స్థానాలు మారడం సహజమే. కానీ, ఒక ముఖ్యమంత్రి తన అధికారిక కుర్చీని వీడి మంత్రుల సీట్లో కూర్చోవడం ఇదే మొదటిసారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదని సభా వర్గాలు చెబుతున్నాయి.

అధికారుల హాజరుపై ప్రతిపక్ష నేత డిమాండ్
ఇదిలా ఉంటే.. అంతకుముందు సభలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల కార్యదర్శులు సభలో తప్పనిసరిగా ఉండేలా చూడాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పీకర్‌ను కోరారు. "గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కరూర్ ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం (ఎంకే స్టాలిన్), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు సభలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు సీఎం, కార్యదర్శులు ఎవరూ సభలో లేరు" అని ఆయన ప్రస్తావించారు.

దీనిపై మంత్రి ఆదవ్ అర్జున స్పందిస్తూ, కార్యదర్శులు పక్కనే ఉన్న 'వార్ రూమ్' నుంచి సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే, ఉదయనిధి వాదనతో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఏకీభవించారు. ఇకపై కీలక చర్చల సమయంలో సీనియర్ అధికారులు సభలో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, సీఎం విజయ్ ఉదయం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిసింది.
Advertisement
C Joseph Vijay
Tamil Nadu Assembly
Udhayanidhi Stalin
Tamil Nadu Politics
Aadhav Arjuna
Assembly Protocol

More Telugu News