కొడుకును కాపాడబోయి.. కొండపై నుంచి పడి తల్లిదండ్రులూ బలి!

Parents die trying to save son by falling from a hill
  • మహారాష్ట్రలో కొండపై నుంచి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
  • ఆత్మహత్య చేసుకుంటానని కొడుకు బెదిరింపు.. మూడు గంటల పాటు హైడ్రామా
  • కాపాడేందుకు యత్నించి అదుపుతప్పి పడిపోయిన తండ్రీకొడుకులు
  • వారిని చూసి షాక్‌లో కిందపడిపోయిన తల్లి.. ముగ్గురి దుర్మరణం
  • ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన
మహారాష్ట్రలో పెను విషాద చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కుమారుడిని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలోని ఖవ్దా కొండపై నుంచి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

దేవలాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు శుక్రవారం ఖవ్దా కొండ అంచుకు చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. సుమారు మూడు గంటల పాటు కొండ అంచునే ఉండిపోయి, కిందకు దూకేస్తానంటూ హెచ్చరించాడు. సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు, గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని వారించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుమారుడిని సురక్షితంగా వెనక్కి లాగే క్రమంలో తండ్రి కొండపైకి వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. కళ్లెదుటే భర్త, కుమారుడు లోయలో పడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి కూడా క్షణాల్లోనే కొండపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఈ దుర్ఘటనను అడ్డుకోలేకపోయారు. గంటల తరబడి సాగిన ఈ ఉదంతాన్ని కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్‌లలో చిత్రీకరించారు.
Advertisement
Chhatrapati Sambhajinagar Family
Khavda Hill Tragedy
Maharashtra Cliff Death
Parent Son Suicide Incident
Devalai Area News

More Telugu News