రాయదుర్గం భూముల వేలం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Telangana Government relief in Supreme Court over Rayadurgam land auction
  • రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
  • వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
  • గచ్చిబౌలి భూములకు, ఈ భూములకు సంబంధం లేదన్న తెలంగాణ ప్రభుత్వం
  • ఏవైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచన
తెలంగాణలోని రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) రాయదుర్గం పాన్ మక్తాలోని సుమారు 11 ఎకరాల భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎకరాకు కనీస ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ, గతంలో కంచ గచ్చిబౌలిలోని భూముల వేలాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం అవే రక్షిత భూములను వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అయితే, తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వాదించారు. ప్రస్తుతం వేలానికి ఉంచిన రాయదుర్గం భూములకు, గతంలో స్టే ఇచ్చిన కంచ గచ్చిబౌలి భూములకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉందన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాయదుర్గం భూముల వేలం ప్రక్రియకు మార్గం సుగమమైంది.
Advertisement
Telangana Government
Rayadurgam Land Auction
Supreme Court of India
TGIIC
Pan Maktha Lands

More Telugu News