కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు
- కొండా సురేఖకు వరుసగా ఎదురుదెబ్బలు
- మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు మరో ఐదుగురిపై హత్యాయత్నం కేసు
- పార్టీలో కూడా సురేఖపై దాదాపు 30 మంది ఎమ్మెల్యేల అసమ్మతి గళం
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే టీపీసీసీ ముందు వివరణ ఇచ్చుకున్న ఆమెకు, తాజాగా మరో రెండు అంశాలు రాజకీయంగా తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్తో పాటు మరో ఐదుగురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ‘అటెంప్ట్ టు మర్డర్’ (హత్యాయత్నం) కేసు నమోదైంది. మేడిపల్లికి చెందిన గొంగడి హరికృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. తనపై సుమంత్ బృందం ఇనుప రాడ్లతో దాడికి పాల్పడిందని బాధితుడు ఫిర్యాదు చేయగా, మొదట మేడిపల్లిలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆపై కేసును జూబ్లీహిల్స్కు బదిలీ చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొండా సురేఖకు వ్యతిరేకంగా అసమ్మతి గళం తీవ్రమైంది. సీఎల్పీ వేదికగా దాదాపు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ఆమె వైఖరిపై చర్చించడం సంచలనం రేపింది. కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ వివరణ ఇచ్చినా, ఆ వ్యాఖ్యలను ఆమె ఎందుకు ఖండించలేదని సదరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అయితే, కొందరు సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకులు సురేఖకు మద్దతుగా నిలుస్తుండటంతో కాంగ్రెస్ వర్గపోరు పీక్స్కు చేరింది.