విశాఖలో దారుణం: ప్రైవేట్ స్కూల్లో ఆరేళ్ల బాలుడి మృతిపై కలకలం

Pranay Teja death in Visakhapatnam private school creates sensation
  • విశాఖ ప్రైవేట్ స్కూల్లో ఆరేళ్ల విద్యార్థి మృతి
  • హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టారని ఆరోపణలు
  • స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు
  • టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల ఆందోళన
విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశాఖలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న లిటిల్ గార్డెన్ స్కూల్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రణయ్ తేజ (6) అనే బాలుడు యథావిధిగా ఉదయం పాఠశాలకు వెళ్లాడు. అయితే, హోంవర్క్ పూర్తి చేయలేదంటూ ఒక ఉపాధ్యాయురాలు బాలుడిని మందలించి, చెంపపై కొట్టారు. దాంతో ఆ బాలుడు టీచర్ ముందే అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయురాలి దండన వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ వారు కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయని, విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను అధికారులు పర్యవేక్షించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్ ఆసుపత్రి వద్ద, నా బిడ్డ నాక్కావాలంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోదించడం చూపరులను సైతం కంటతడిపెట్టించింది.
Advertisement
Pranay Teja
Visakhapatnam
Little Garden School Vizag
School student death
Teacher punishment death

More Telugu News