సీబీఎస్ఈ 3 భాషల విధానం అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రణాళికను పునఃపరిశీలించాలని బోర్డుకు ఆదేశం
- మూడు భాషల విధానం అమలుపై సుప్రీంకోర్టు అభ్యంతరం
- ఈ విధానం అమలుపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశం
- మూడు భాష విద్యార్థులపై అదనపు భారాన్ని మోపడమే అవుతుందన్న ధర్మాసనం
సీబీఎస్ఈ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలును తాము వ్యతిరేకించడం లేదని, అయితే దీనిని అమలు చేసే క్రమంలో విద్యార్థులపై అనవసర ఒత్తిడి పడకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ విధానం యొక్క ఆచరణాత్మక అమలుపై మరోసారి సమగ్రంగా అధ్యయనం చేయాలని బోర్డును ఆదేశించింది.
ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రధానాంశాలు:
ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి వచ్చేసరికి మూడో భాషలో కూడా తప్పనిసరిగా బోర్డు పరీక్ష రాయాల్సి రావడం వారిపై అదనపు భారాన్ని మోపడమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ప్రస్తుత 6వ తరగతి విద్యార్థులకు ఈ మూడో భాష బోర్డు పరీక్ష నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా, ఈ విధానాన్ని అసలు 6వ తరగతి నుంచి ప్రారంభించాలా లేక ప్రాథమిక స్థాయిలోనే 3 లేదా 4వ తరగతి నుంచే అమలు చేయాలా అనే విషయాన్ని కూడా పునరాలోచించాలని స్పష్టం చేసింది.
పాఠశాలల్లో సరిపడా అర్హత కలిగిన ఉపాధ్యాయుల లభ్యత, పాఠ్యపుస్తకాలు, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై స్పష్టమైన రోడ్మ్యాప్ను రూపొందించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థులు ఇన్నాళ్లుగా చదువుతున్న విదేశీ భాషల కాంబినేషన్ దెబ్బతినకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.