రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెనుక దేశవ్యతిరేక శక్తులు: ధర్మపురి అర్వింద్
- రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై ధర్మపురి అర్వింద్ విమర్శలు
- రేవంత్ విదేశీ పర్యటనలన్నీ దేశంపై విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతున్నాయని ఆరోపణ
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల లక్ష్యంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ పెట్టుబడుల సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న విదేశీ పర్యటనలన్నీ భారత్పై విద్వేషం చిమ్మే వర్గాలతోనే సాగుతోందని ఆయన ఆరోపించారు. జార్జ్ సోరోస్ వంటి భారత్ వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థల నిధులతో నడిచే వేదికల వద్దకే సీఎం వెళుతున్నారని విమర్శించారు. దేశవ్యతిరేక ఐడియాలజీ ఉన్న సంస్థలను కలవడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు.
అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హెచ్చరిస్తూ... గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాజకీయ నాయకుల మాటలు విని పలువురు అధికారులు చివరకు జైలుపాలు కావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి వల్ల అధికారులకు ఎటువంటి రక్షణ ఉండదని, భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.