వైసీపీ హయాంలో ఫేక్ డేటా.. మేం వచ్చాక ప్రక్షాళన చేశాం: మంత్రి లోకేశ్
- మా హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయన్న లోకేశ్
- గత వైసీపీ ప్రభుత్వం ఫేక్ డేటాను చూపించిందని ఆరోపణ
- డేటా ప్రక్షాళన తర్వాత ప్రవేశాల సంఖ్య పెరిగిందని వెల్లడి
- గత రెండేళ్లలో ఏ ప్రభుత్వ పాఠశాలను మూసివేయలేదని స్పష్టీకరణ
తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఫేక్ డేటా కారణంగా ప్రవేశాల సంఖ్య తప్పుగా నమోదైందని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని సరిచేశామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా తగ్గాయని విమర్శించారు. 2022-23లో 7.6%, 2023-24లో 3.03%, 2024-25లో 3.24% చొప్పున ప్రవేశాలు తగ్గాయని గణాంకాలతో సహా వివరించారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ డేటాను తొలగించామని, అవకతవకలను నివారించామని లోకేశ్ చెప్పారు. ఈ ప్రక్షాళన కారణంగా 2025-26లో ప్రవేశాలు 1.69% తగ్గినట్టు కనిపించినా, 2026-27 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 0.94% మేర ప్రవేశాలు పెరిగాయని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలను కూడా మూసివేయలేదని మంత్రి సభకు తెలియజేశారు.