‘ఆయన చెప్పింది నిజమే’.. రాజగోపాల్‌ రెడ్డికి కేటీఆర్‌ మద్దతు!

KTR supports Rajgopal Reddy saying what he said is true
  • అవినీతిపై రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు
  • రూ.5 లక్షల ఇంటికి 500 నిబంధనలంటూ మండిపాటు
  • భారీ దోపిడీ జరుగుతోందని ఆరోపణ
  • రాజగోపాల్‌ మాటలతో ఏకీభవిస్తున్నానన్న కేటీఆర్‌
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మద్దతు తెలిపారు. అభివృద్ధి పేరుతో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్‌ అన్నారు. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5-6 లక్షలు ఇవ్వాలంటే ప్రభుత్వం 500 నిబంధనలు పెడుతోందని రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. అదే సమయంలో పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

రాజగోపాల్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిపై పోరాడతానని హెచ్చరించారు. తన సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని అన్నారు. పేదల ఇళ్ల విషయంలో నిబంధనలు కఠినంగా పెడుతున్న ప్రభుత్వం భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారన్న రాజగోపాల్‌ రెడ్డి మాటలు నిజమేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను రాహుల్‌ గాంధీ, ఏఐసీసీకి ఏటీఎంగా మార్చుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీ రాష్ట్రం ఏఐసీసీకి ఏటీఎంగా మారిందని చెబుతున్నారని కేటీఆర్‌ గుర్తుచేశారు. మరి అలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై ఈడీ దాడులు జరిగినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు కనిపించలేదన్నారు.
Advertisement
KTR
Komatireddy Rajgopal Reddy
Telangana Congress Corruption
Rahul Gandhi ATM
BRS vs Congress
Telangana Politics

More Telugu News