22ఏ పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది: బండి సంజయ్
- నిషేధిత భూముల ముసుగులో భారీ దోపిడీ జరుగుతోందన్న బండి సంజయ్
- ఏకంగా 95 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్న
- ప్రభుత్వం వేలం వేసిన భూములను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నారని విమర్శ
తెలంగాణలో నిషేధిత భూముల జాబితా (22ఏ) ముసుగులో భారీ దోపిడీ సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనల మధ్య ఎలాంటి తేడా లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న 2.77 కోట్ల ఎకరాల్లో ఏకంగా 95 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని బండి సంజయ్ నిలదీశారు. ప్రజలు కష్టపడి కొనుక్కున్న స్థలాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములు, ప్రభుత్వమే వేలం వేసిన భూములను కూడా ఈ జాబితాలో చేర్చి వేధిస్తున్నారని విమర్శించారు. విద్యాసంస్థల ఫీజు రీయింబర్స్ మెంట్ పాత బకాయిలను ఇంకా చెల్లించకుండా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్ ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. జెన్-జీ యువతకు స్థానం కల్పిస్తామనే కాంగ్రెస్ మాటలు నిజమైతే... వెంటనే యువకులకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని సవాల్ విసిరారు.