గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. రూ.1000 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

Godavari Pushkaralu massive preparations Telangana government allocates 1000 crore rupees
  • గోదావరి పుష్కరాలపై రేవంత్ సర్కారు ఫోకస్
  • సెప్టెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం
  • రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల నియామకం
  • పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్‌బోర్డ్
  • పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ పుష్కరాల పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. సెప్టెంబర్ మొదటి వారంలోనే పనులు ప్రారంభించి, ఆగస్టు నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో 'గోదావరి పుష్కరాలు-2027'పై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా జరుగుతున్న పురోగతిని కమిటీ సభ్యులు సమీక్షించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.

భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే 'టైర్-1' ప్రాంతాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా సీనియర్ అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి, స్థానిక నిధులతో పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు, పండితులను భాగస్వాములను చేయాలని సూచించారు. భక్తులకు సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలన్నారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే పుష్కరాలు విజయవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Godavari Pushkaralu 2027
Telangana Government
Sridhar Babu
Pushkaralu Budget
Telangana Cabinet Sub Committee
Godavari River Festival

More Telugu News