గోదావరి జలాల వినియోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy issues key orders on Godavari water utilization
  • గోదావరి నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం
  • ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం ఆదేశం
  • కాళేశ్వరం బ్యారేజీల భద్రతపై ఎన్డీఎస్ఏ సూచనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం
  • భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేందుకు కార్యాచరణకు ఆదేశం
గోదావరి నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతల (లిఫ్ట్) ప్రక్రియను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నీటిపారుదల శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సిఫార్సుల మేరకు ప్రస్తుతం సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం లేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. 

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలలో కొన్ని లోపాలను గుర్తించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించగా, ఈ అంశంపై తక్షణమే ఎన్డీఎస్ఏను సంప్రదించాలని సీఎం సూచించారు. దేవాదుల ప్రాజెక్టులో తొమ్మిది పంపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం కీలకమని, అక్కడ ఎదురవుతున్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపునకు గురయ్యే గ్రామాలు, పెండింగ్ పరిహారం, పునరావాస ప్యాకేజీలపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికలు అందజేయాలని రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన పరిహారం చెల్లిస్తేనే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులను నింపడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

గట్టు, గుడెందొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుపై తగిన అధ్యయనం చేయాలని, గుడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌ను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Revanth Reddy
Godavari Water Utilization
Telangana Irrigation Projects
Kaleshwaram Project NDSA
Medigadda Barrage Repairs

More Telugu News