శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: బొత్స సత్యనారాయణ
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజాప్రతినిధులకు జగన్ పిలుపు
- డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం స్పందించడం లేదన్న బొత్స
- 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్న
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో చర్చించిన కీలక అంశాలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
డీఎస్సీ నియామకాల స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆధారాలున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బొత్స ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై శాసనమండలిలో పోరాడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి అంతా సీఎం చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామన్నారు. 40 శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. చట్టసభల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు.