భారత్‌లో డిజిటల్ విప్లవం.. డిజిలాకర్‌కు 72 కోట్లు, ఉమంగ్‌కు 11 కోట్ల యూజర్లు!

Digital Revolution in India DigiLocker reaches 72 crore and UMANG 11 crore users
  • డిజిలాకర్ యూజర్ల సంఖ్య 72.43 కోట్లు దాటిందని కేంద్రం వెల్లడి
  • గత మూడేళ్లలో ఉమంగ్ ప్లాట్‌ఫామ్‌పై దాదాపు 798 కోట్ల లావాదేవీలు
  • డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పౌర సేవలు మరింత సులభతరం
  • గ్రామ పంచాయతీ స్థాయిలో 4 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు 
  • మహిళల ఆధ్వర్యంలో 70,000కు పైగా సీఎస్‌సీల నిర్వహణ
దేశంలో డిజిటల్ సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువవుతున్నాయని, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్లాట్‌ఫామ్‌లైన 'డిజిలాకర్', 'ఉమంగ్' అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నేడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లలో డిజిలాకర్ వినియోగదారుల సంఖ్య 72.43 కోట్లకు చేరిందని, ఈ ప్లాట్‌ఫామ్‌పై 72.86 కోట్ల డాక్యుమెంట్ యాక్సెస్ లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. అదే సమయంలో 'ఉమంగ్' ప్లాట్‌ఫామ్‌లో 11.66 కోట్లకు పైగా యూజర్లు నమోదు కాగా, సుమారు 798 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు వివరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా, టెక్నాలజీని సామాన్య ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేసే లక్ష్యంతో 2015 జులైలో 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పౌర కేంద్రీకృత సేవలను సులభంగా అందించేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది జులై 31 నాటికి దేశవ్యాప్తంగా ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌పై 2,575 సేవలు (కేంద్రం: 880, రాష్ట్రాలు: 1,695), డిజిలాకర్‌పై 5,437 రకాల డాక్యుమెంట్లు/సేవలు (కేంద్రం: 661, రాష్ట్రాలు: 4,776) అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలను అందించేందుకు 'కామన్ సర్వీస్ సెంటర్ల' (సీఎస్‌సీ) నెట్‌వర్క్‌ను ప్రభుత్వం విస్తరించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 జూన్ 30 నాటికి గ్రామ పంచాయతీ స్థాయిలో 4,07,122 సీఎస్‌సీలు పనిచేస్తున్నాయని, వీటిలో 70,069 కేంద్రాలను మహిళా పారిశ్రామికవేత్తలు (విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నిర్వహిస్తుండటం విశేషమని అన్నారు. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, పింఛను వంటి అనేక సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.

ఉమంగ్, డిజిలాకర్ ప్లాట్‌ఫామ్‌లు మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల పౌరులు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ప్రభుత్వ సేవలను పొందవచ్చని మంత్రి వివరించారు. ఆధార్, ఈ-సైన్, ఏపీఐ సేతు వంటి కీలకమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఈ ప్లాట్‌ఫామ్‌లను అనుసంధానించామని, తద్వారా సురక్షితమైన, కాగితరహిత సేవలు అందించడం సాధ్యమవుతోందని తెలిపారు. ఈ విధానం వల్ల భౌతికంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం తగ్గి, పౌరులకు సమర్థవంతమైన సేవలు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Ashwini Vaishnaw
DigiLocker
UMANG App
Digital India
Common Service Centers
Digital Revolution India

More Telugu News