హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి వినియోగం.. ఈగిల్ దాడుల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్
- హెచ్సీయూలో గంజాయి వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు
- తనిఖీల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్
- గ్రాము గంజాయి రూ.500కు విక్రయిస్తున్న పెడ్లర్లు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై తెలంగాణ ‘ఈగిల్’ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్ లోపల గంజాయి వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, అనుమానితులైన పలువురు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్గా నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది.
ఈ తనిఖీల క్రమంలో వర్సిటీలో అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోం రాష్ట్రం నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి, యూనివర్సిటీ విద్యార్థులకు గ్రాము రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం, ఈగిల్ టీమ్ తదుపరి విచారణను వేగవంతం చేశాయి.