ప్రజల ముంగిటకు కూటమి పాలన.. 16వ రోజూ జోరుగా 'ఇంటింటికీ తెలుగుదేశం'

Telugu Desam Party door to door campaign continues successfully on day 16
  • 16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
  • ప్రతిరోజు 3 లక్షలకు పైగా కుటుంబాలతో మమేకమవుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
  • ప్రజా స్పందనతో మరింత ఉత్సాహంగా కొనసాగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం'
  • ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలకు నారా లోకేష్ అభినందనలు
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం - 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం 16వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ, ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న పార్టీ శ్రేణులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

16వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3.25 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 16 రోజుల్లో మొత్తం 47.50 లక్షల గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లయింది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కుటుంబాలను కలుస్తూ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం తదితర కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు.

'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను యువనేత అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వారికి సూచించారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అందించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Advertisement
Telugu Desam Party
Nara Lokesh
Intintiki Telugu Desam
Andhra Pradesh Welfare Schemes
TDP Door to Door Campaign

More Telugu News