పింగళి వెంకయ్యకు ఇచ్చే నిజమైన గౌరవం భారతరత్న మాత్రమే: వి. హనుమంతరావు
- భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య అన్న వీహెచ్
- భారతరత్న ఇవ్వడం ద్వారానే ఆయనకు నిజమైన గౌరవం లభిస్తుందని వ్యాఖ్య
- పింగళి సేవలను మోదీ ఎందుకు విస్మరిస్తున్నారో అని ప్రశ్న
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్యకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిన త్రివర్ణ పతాకాన్ని అందించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి భారత ప్రభుత్వం ఇవ్వగల ఏకైక సముచితమైన నివాళి భారతరత్న మాత్రమేనంటూ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపును స్వాగతిస్తూనే... జాతీయ జెండా రూపకర్త విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని వీహెచ్ ఎండగట్టారు. దేశమంతటా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్నప్పుడు, దానికి ప్రాణం పోసిన తెలుగు నేల ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య సేవలను ప్రధాని మోదీ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదని ఘాటుగా ప్రశ్నించారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇస్తేనే ప్రతి భారతీయుడికి, సమరయోధుల త్యాగాలకు సరైన గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలోనే తాను హైదరాబాద్లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఈ మహత్తర నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.