పేద పిల్లల కలలకు బలమైన పునాదులు వేయాలంటే నిజమైన సంకల్పం ఉండాలి: రేవంత్ రెడ్డి
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్న రేవంత్
- ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని వ్యాఖ్య
- తెలంగాణ మోడల్ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తుందన్న సీఎం
భవనాలు నిర్మించడం ఎవరికైనా సులభమే కావచ్చు.. కానీ పేద పిల్లల కలలకు బలమైన పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి నిజమైన సంకల్పం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కులం, మతం, ప్రాంతం, పేదరికం అనే అసమానతలను చెరిపేస్తూ... ప్రతీ చిన్నారికీ కార్పొరేట్తో సమానమైన ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకుంటున్న ఈ సమీకృత గురుకులాలు సాధారణ పాఠశాలలు మాత్రమే కావని... పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలని సీఎం అన్నారు. పేద పిల్లల ఉన్నత కలలకు శాశ్వత చిరునామాగా నిలుస్తూ, దేశానికే ‘తెలంగాణ మోడల్’ విద్యారంగానికి ప్రతీకగా నిలిచేలా ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు తరతరాల భవిష్యత్తును మార్చబోతున్నాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.