కేరళలో మెస్సీ మ్యాచ్‌పై సంచలన నివేదిక.. తీవ్ర ఆర్థిక అవకతవకలు జరిగాయా?

Sensational report on Messi match in Kerala regarding serious financial irregularities
  • కేరళలో అర్జెంటీనా మ్యాచ్ నిర్వహణ వైఫల్యంపై విచారణ
  • ప్రస్తుత ప్రభుత్వానికి స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ నివేదిక సమర్పణ
  • నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తింపు
  • మాజీ క్రీడల మంత్రి వి. అబ్దురహిమాన్ పాత్రపై విచారణకు సిఫార్సు
  • ఎలాంటి అనుమతులు లేకుండానే స్టేడియం అప్పగించారని వెల్లడి
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా జట్టును కేరళకు తీసుకువచ్చే ప్రయత్నం విఫలం కావడంపై తీవ్ర వివాదం రాజుకుంది. గత వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై నియమించిన విచారణ కమిటీ తన నివేదికను ప్రస్తుత వి.డి. సతీశన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగినట్టు తేలడంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్. ప్రశాంత్ నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జెంటీనా మ్యాచ్ కోసం స్పాన్సర్‌ను ఎంపిక చేసిన విధానం, ఆర్థిక లావాదేవీలు, కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియం అప్పగింత వంటి అంశాల్లో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్టు నివేదిక స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని కూడా నివేదికలో పేర్కొన్నారు.

అసలు అర్జెంటీనా జట్టు కేరళకు వస్తుందనడానికి ఎలాంటి అధికారిక పత్రాలు, ఒప్పందాలు లేవని విచారణలో తేలడం గమనార్హం. ఫిఫా రిజిస్ట్రేషన్, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్‌) అనుమతి వంటి తప్పనిసరి క్లియరెన్సులు లేకుండానే ఈ ప్రక్రియను వేగంగా ముందుకు నడిపారని నివేదిక గుర్తించింది.

ఈ వ్యవహారంలో గత క్రీడల శాఖ మంత్రి వి. అబ్దురహిమాన్ పాత్రపై కమిటీ తీవ్ర ఆరోపణలు చేసింది. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఈవెంట్‌కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ మంత్రి కార్యాలయం నేరుగా నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఆయన చేసిన అధికారిక ప్రయాణాలు, ఈ-మెయిల్ కమ్యూనికేషన్లపై సమగ్ర విచారణ జరపాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఇక, కొచ్చిలోని స్టేడియం అప్పగింతలోనూ భారీ లోపాలున్నట్టు నివేదిక పేర్కొంది. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేకుండానే స్టేడియంను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారని, కనీస ఆర్థిక భద్రత చర్యలైన ఇన్సూరెన్స్ కవర్, బ్యాంక్ గ్యారెంటీ వంటివి కూడా తీసుకోలేదని వెల్లడించింది. మెస్సీ, అర్జెంటీనా జట్టు వస్తోందన్న వార్తలతో కేరళలో భారీ అంచనాలు నెలకొనగా, చివరకు ఆ ఈవెంట్ రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విచారణ నివేదికతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.
Advertisement
Lionel Messi
Argentina Football Team
Kerala Football Controversy
V Abdurahiman
Kerala Sports Ministry Report
Kochi Stadium Deal

More Telugu News