పంజాగుట్ట శ్మశానవాటికలో కలకలం.. చిన్నారి మృతదేహం అదృశ్యం
- చార్మినార్ కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం జన్మించిన కవలలు
- అనార్యోగ్యంతో మరణించిన ఒక శిశువుకు గత శనివారం అంత్యక్రియలు
- మరుసటి రోజే మరణించిన మరో శిశువు
- అంత్యక్రియలు చేయడానికి వెళ్లగా కనిపించని మొదటి శిశువు మృతదేహం
పురిట్లోనే కవల పిల్లలను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న దంపతులకు శ్మశానవాటికలో ఊహించని షాక్ తగిలింది. ఖననం చేసిన ఒక పసిపాప మృతదేహం మాయమైన ఘటన హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో తీవ్ర కలకలం రేపింది.
చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం నెలలు నిండకుండానే కవల పిల్లలు జన్మించారు. తీవ్ర అనారోగ్యంతో బంజారాహిల్స్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఒక శిశువు మరణించగా, కుటుంబసభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. తీరా మరుసటి రోజే (ఆదివారం) రెండో శిశువు కూడా కన్నుమూయడంతో, ఆ మృతదేహాన్ని కూడా పూడ్చిపెట్టేందుకు అదే శ్మశానవాటికకు వెళ్లిన తల్లిదండ్రులకు దిగ్భ్రాంతి కలిగించే దృశ్యం ఎదురైంది. క్రితం రోజే తవ్విన గొయ్యి తెరిచి ఉండటం, లోపల ఉన్న మొదటి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
మృతదేహం ఏమైందని అక్కడ పనిచేసే శ్మశానవాటిక సిబ్బందిని ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితులు వెంటనే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అందులో భాగంగా శ్మశానవాటిక కాటికాపరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ మృతదేహాన్ని కుక్కలు ఏమైనా లాక్కెళ్లాయా లేదా ఏదైనా దురాగతానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.