తెలుగు అమ్మాయిలతో స్కెచ్.. ఢిల్లీ కేంద్రంగా భారీ మోసం గుట్టురట్టు!

Telangana Police raid in Delhi
  • ఢిల్లీలోని ఫేక్ కాల్ సెంటర్లపై తెలంగాణ సైబర్ బ్యూరో దాడులు
  • తెలుగు మాట్లాడే యువతులనే టెలీకాలర్లుగా నియమించుకున్న కేటుగాళ్లు
  • లోన్ల పేరుతో మోసం, 21 మంది యువతులతో పాటు వ్యక్తి అరెస్టు
  • ప్రధాన సూత్రధారులు పరారీ, కొనసాగుతున్న దర్యాప్తు
ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. బజాజ్ ఫైనాన్స్ పేరుతో రుణాలు ఇస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సంబంధించి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 21 మంది తెలుగు యువతులు, ఒక బ్యాంకు ఖాతాదారుడు ఉన్నారు.

గత 18 నెలలుగా ఈ ముఠా చురుకుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా ఫోన్లు చేసి, ఆకర్షణీయమైన రుణాలను ఆమోదించినట్లు నమ్మించేవారు. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజులు, వెరిఫికేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్ వంటి పేర్లతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు.

ఈ మోసాలకు పాల్పడేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే యువతులనే నియమించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి యువతులను టెలీకాలర్లుగా రిక్రూట్ చేసుకున్నారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా ఈ కాల్ సెంటర్లను నడిపిస్తున్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ముఠాకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 22 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సందర్భంగా 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన యువతుల వయసు 20 నుంచి 42 ఏళ్ల మధ్య ఉంది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలింపు ముమ్మరం చేశామని, మనీ ట్రయల్‌పై దృష్టి సారించి మోసం పూర్తి స్థాయిని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Telangana Police raid in Delhi
Telangana Police

More Telugu News