కేసీఆర్ చేసినన్ని యాగాలు దేశంలో ఎవరూ చేసి ఉండరు: కేటీఆర్

KCR performed more yagams than anyone in the country says KTR
  • ముఖ్యమంత్రి రేవంత్‌కు వ్యవసాయంపై అవగాహన శూన్యమన్న కేటీఆర్
  • నీటి హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధమన్న కేటీఆర్
  • 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపించాలని సవాల్
  • ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ తీవ్ర పోరాటం చేస్తుందని వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించినన్ని యాగాలు దేశంలో మరెవరూ చేసి ఉండరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవబలం సిద్ధించాలంటే ముందుగా మానవ ప్రయత్నం ఉండాలని, యాగాలు నిర్వహిస్తూనే ప్రభుత్వాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లడాన్ని ఎగతాళి చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేదని ఆయన ఆరోపించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి, ఆ జిల్లాకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తుంటే ఇక్కడి ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గోదావరి బోర్డు సమావేశంపై ప్రభుత్వ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. 'హైడ్రా' పేరుతో పేదలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. నీటి హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ తరహాలోనే మరో భారీ పోరాటానికి సిద్ధమవుతామని కేటీఆర్ హెచ్చరించారు.
Advertisement
KTR
KCR
Revanth Reddy
Telangana Politics
BRS Party
Telangana Irrigation Rights

More Telugu News