ఈ నెల 11 లోపు కృష్ణా నీటిని విడుదల చేయకపోతే నార్లాపూర్ ను ముట్టడిస్తాం: నిరంజన్ రెడ్డి హెచ్చరిక
- నీళ్లు లేవంటూ రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారన్న నిరంజన్ రెడ్డి
- ఏపీకి నీళ్లు తరలించేందుకు చంద్రబాబుకు సహకరిస్తున్నారని ఆరోపణ
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పక్కన పెట్టేశారని మండిపాటు
జూరాల ప్రాజెక్టు పరిధిలోని భీమా ఫేజ్-1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్లతో పాటు కేఎల్ఐ కింద ఉన్న పంపులను తక్షణమే ప్రారంభించి పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11వ తేదీలోపు పంపులను ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి భారీ సంఖ్యలో రైతులతో నార్లాపూర్ ప్రాజెక్టును ముట్టడిస్తామని హెచ్చరించారు.
కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ, నీళ్లు లేవంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే ఏపీకి నీళ్లు తరలించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించిన ఆయన... కర్ణాటక నుంచి వచ్చే వృథా నీటితోనే డిసెంబర్ వరకు జూరాలకు పుష్కలంగా నీరు అందుతుందని, వెంటనే ఎత్తిపోతల పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.