డీఎస్సీ లీకేజీపై సీబీఐ విచారణకు భయమెందుకు?: జగన్

YS Jagan Mohan Reddy questions why government fears CBI probe on DSC leakage
  • డీఎస్సీ అభ్యర్థులపై దాడులను ఖండిస్తున్నామంటూ జగన్ ప్రకటన
  • లోకేశ్‌ను కాపాడేందుకే ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపణ
  • డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్న జగన్
  • విద్యా దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
డీఎస్సీ-2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న నిరుద్యోగ యువతపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుమారుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కాపాడేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంతగా దిగజార్చుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని సూటిగా ప్రశ్నించారు.

ఈ మేరకు జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ విజయవాడలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, శిబిరాన్ని ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. పోలీసుల కళ్లెదుటే ఈ దౌర్జన్యం జరిగిందని, టెంట్లు పీకేసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా నిరుద్యోగులపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడులు కేవలం విజయవాడకే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండ కొనసాగుతోందని జగన్ తెలిపారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు పలుచోట్ల నిరసన శిబిరాలపై దాడులు చేసి, నాయకులను నిర్బంధించారని వివరించారు. శాంతియుతంగా ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెబుతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు.
1. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి.
2. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
3. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 చొప్పున గత రెండేళ్ల బకాయిలతో సహా నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలి.

"చంద్రబాబు గారూ... మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు, పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు" అని జగన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
Advertisement
YS Jagan Mohan Reddy
DSC 2025 paper leak
Nara Lokesh resignation
CBI probe on DSC
Andhra Pradesh unemployment protests
Chandrababu Naidu government

More Telugu News