విద్యార్థులతో రాహుల్‌ గాంధీ సభకు అనుమతి రద్దు.. యూపీలో రాజకీయ దుమారం

Rahul Gandhi student meeting permission cancelled political storm in UP
  • విద్యార్థులతో రాహుల్‌ సభకు అనుమతి నిరాకరణ
  • ప్రయాగ్‌రాజ్‌లో రాజకీయ వివాదం
  • వర్షాలు, భద్రత కారణమని వివరణ
  • బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణలు
  • భయపడే అనుమతులివ్వడం లేదని వ్యాఖ్య
  • నిర్ణయాన్ని తప్పుబట్టిన విపక్షాలు
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో నిర్వహించనున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం చుట్టూ రాజకీయ వివాదం చెలరేగింది. ఆగస్టు 8న ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో జరగాల్సిన సభకు ఇచ్చిన అనుమతిని చివరి నిమిషంలో రద్దు చేయడంతో కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేపీ గ్రౌండ్ నిర్వహణ బాధ్యతలు చూసే కాయస్థ పాఠశాల ట్రస్ట్.. భారీ వర్షాలు, భద్రతా పరిస్థితులు, కోర్టు ఆదేశాల కారణంగానే అనుమతి వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

అయితే ఇది బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ ఆరోపించింది. విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ విమర్శించారు. కోటా, డెహ్రాడూన్ తర్వాత ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొందని అన్నారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ వ్యవహారంపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ‘‘ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, అలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని అన్నారు.
Advertisement
Rahul Gandhi
Uttar Pradesh
Prayagraj
Chhatron Ki Goonj
Congress Party
BJP Government

More Telugu News